
తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు టీటీడీ “సైలెంట్ తిరుమల” కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ కార్యక్రమంలో భాగంగా తిరుమల ఘాట్ రోడ్లలో, కొండపై హారన్లు అనవసరంగా మోగించవద్దని వాహనదారులకు సూచించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రధాన రహదారులు, కీలక ప్రాంతాల్లో ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసింది. తిరుమలలో గోవింద నామస్మరణ, వేదఘోషలు మాత్రమే వినిపించేలా ప్రశాంత వాతావరణాన్ని కాపాడడమే టీటీడీ ప్రధాన ఉద్దేశం. అందుకే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ట్యాక్సీలు, భక్తుల వ్యక్తిగత వాహనాలు, టీటీడీ వాహనాలు, పోలీసు వాహనాలు… ఇలా అన్ని వాహనాలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి.అత్యవసర పరిస్థితులు మినహా సైరన్లు, హారన్ల వినియోగాన్ని నివారించాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుమలకు రోజురోజుకూ వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు టీటీడీ తెలిపింది.ఈ నిబంధనలను భక్తులు స్వచ్ఛందంగా పాటించి టీటీడీకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై అవసరమైతే చట్టపరమైన చర్యలు, జరిమానాలు విధించే అవకాశం కూడా ఉందని టీటీడీ స్పష్టం చేసింది.స్వామివారి సన్నిధిలో ప్రశాంతత, పవిత్రత, ఆధ్యాత్మికతను పరిరక్షించడం ప్రతి భక్తుని బాధ్యత. గోవింద నామస్మరణలతో నిండిన తిరుమల మహిమాన్విత వాతావరణాన్ని కాపాడేందుకు చేపట్టిన ఈ “నో హారన్” కార్యక్రమానికి భక్తులంతా సహకరించాలని టీటీడీ కోరుతోంది.
