
రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి జోసెఫ్ అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోనూ దుమారం రేపుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో రావణ్ను పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. అయితే, ఈ ఘటనపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, నిర్మాత బండ్ల గణేశ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది.
ప్రశ్న రావణ్కు గన్నవరం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసిన ఆయన ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు పెట్టిన తప్పుడు కేసుల్లో కోర్టు నాలుగుసార్లు బెయిల్ మంజూరు చేసినా, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా దేశద్రోహం కేసు పెట్టి రిమాండ్కు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహులు అయిపోతారా? అని ప్రకాశ్ రాజ్ నిలదీశారు. ఇది కేవలం ప్రశ్నించే గొంతులను అణచివేసే కుట్రలో భాగమని మండిపడ్డారు. అంతేకాదు రావణ్ ఫోన్ పోలీసుల వద్దే ఉందన్న ప్రకాశ్ రాజ్.. అందులోని వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసి అతడిని, అతనికి మద్దతుగా నిలిచే వారిని మానసికంగా వేధించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మీ ఆట ప్రొఫెసర్ నాగేశ్వర్తో మొదలైంది. దీనికి ప్రజలే తగిన ముగింపు పలుకుతారు అంటూ ‘గేమ్ ఆన్’ అని ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు.
ప్రకాశ్ రాజ్ రిలీజ్ చేసిన ఈ వీడియోపై పవన్ కల్యాణ్ వీరాభిమాని, నిర్మాత బండ్ల గణేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకాశ్ రాజ్ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని ఘాటైన ట్వీట్ చేశారు. నువ్వు రాత్రి తాగుతావు… ఉదయాన్నే వాంతులు చేసుకుంటావు. నీ జీవితంలో చెప్పుకోదగ్గ మంచి పని ఒక్కటి లేదు. నీకు వ్యాపారాలు లేవు, సినిమాలు లేవు, షూటింగులు లేవు. కేవలం పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు, పనికిరాని గొడవలు… ఇదే నీ దినచర్య. ఇప్పటికైనా ప్రశాంతంగా నీ పని నువ్వు చూసుకుని, సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరులపై నోరు పారేసుకుని, నీ విలువ తగ్గించుకోకు” అని పేర్కొన్నారు. బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

