
• అమర స్థూపం వద్ద వీర జవాన్లకు ఘన నివాళి
• త్యాగచక్ర గోడలపై తెలుగు సైనికుల ఫలకాలకు అంజలి ఘటించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
భారత సైనికుల త్యాగం, ధైర్యం, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచే ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ సందర్శించారు. అమరస్థూపం వద్ద వీర జవాన్లకు పుష్పగుచ్ఛం సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వందనం సమర్పించారు. కల్నల్ ఆర్.కె. ఆనంద్ , కెప్టెన్ రోహిత్ గార్గ్ నేతృత్వంలో ఈ వందన సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దేశ భద్రత కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల జీవితాలను సైనికాధికారులు వివరిస్తుంటే శ్రద్ధగా ఆలకించారు. సైనికుల ప్రాణత్యాగాల తాలూకు ఔన్నత్యాన్ని తెలుసుకునే అవకాశం దక్కడం, వారికి నివాళులు అర్పించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు.
అనంతరం వార్ మెమోరియల్ లో త్యాగచక్ర పేరిట అమర జవాన్ల పేర్లతో చెక్కిన వివరాలను సందర్శించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వీర జవాన్ శ్రీ జి.ఎన్.ఆర్. సతీష్ తదితరుల పేర్లతో చెక్కిన గోడలకు నివాళులు అర్పించారు. సౌర్య చక్ర శ్రీ రాజ్ కుమార్, హావల్దార్ అరుణ్ కుమార్ ల పేర్ల వద్ద పుష్పాలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం వార్ మెమోరియల్ సందర్శనకు గుర్తుగా డిజిటల్ బుక్ లో సంతకం చేశారు. వార్ మెమోరియల్ లో నాలుగు స్మారక చక్రాల విశేషాలను సైనికాధికారులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం వేలాది మంది నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించి తమకు ఇష్టమైన వీర జవాన్ల పేర్లు లిఖించిన గ్రానైట్ ఫలకాలకు నివాళులు అర్పిస్తూ ఉంటారని, వార్ మెమోరియల్ కి వచ్చే వారంతా దీన్ని ఓ దేవాలయంలా భావిస్తారని మిలటరీ అధికారులు వివరించారు.

