
న్యూజెర్సీ, అమెరికా: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం బ్రిడ్జ్వాటర్లో ఉన్న కూచిపూడి డాన్స్ సెంటర్ సిల్వర్ జూబ్లీ వేడుక బ్రిడ్జ్వాటర్ బాలాజీ మందిర్లో అత్యంత వైభవంగా నిర్వహించింది. సంస్థ వ్యవస్థాపకురాలు, ప్రముఖ కూచిపూడి నృత్య గురువు ఇందిరా శ్రీరామ లీలా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు కళాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను విదేశీ గడ్డపై పరిరక్షిస్తూ, గత 25 ఏళ్లుగా కూచిపూడి కళను యువతరానికి చేరవేస్తున్న కూచిపూడి డాన్స్ సెంటర్ ఈ ప్రత్యేక మైలురాయిని ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ప్రస్తుత, పూర్వ విద్యార్థులు, కళాభిమానులు, తల్లిదండ్రులు మరియు తెలుగు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్ సత్యం ఆశీస్సులు, మార్గదర్శకత్వంతో కొనసాగుతున్న ఈ సంస్థ కూచిపూడి నృత్య కళా వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో విశేష సేవలందిస్తోంది. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు ఇందిరా శ్రీరామ లీలా మాట్లాడుతూ, కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని భావితరాలకు అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
