
• రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కులాల దరిద్రం పోవాలి
• క్రిమినల్స్ చేతికి అధికారం వస్తే ప్రజల భవిష్యత్తు మంటగలుస్తుంది
• శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
• నేరం చేసినవాళ్ళను కుల కోణంలో చూడొద్దు
• తప్పు చేస్తే మిమ్మల్ని ఏ పార్టీ రక్షించలేదు
• కాకినాడలో ‘మన ఊరు – మాట మంతి’ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
‘సమాజంలో నేరస్థులను కేవలం క్రిమినల్స్ గా మాత్రమే చూడాలని, వారికి కులాల చాటున చూడకూడదు’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే ఆంధ్రప్రదేశ్ కు కులాల దరిద్రం వదిలిపోవాలన్నారు. తప్పు చేసిన వాడికి, నేరాలకు పాల్పడేవారికి ఎలాంటి కులం, మతం ఉండవని, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అటువంటి నీచమైన శక్తులను ఏ ఒక్కరూ సమర్థించకూడదని చెప్పారు. క్రిమినల్ గ్యాంగ్ల సహాయంతో ప్రభుత్వాలను నడపాలని చూడటం, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. క్రిమినల్స్ అధికారంలోకి వస్తే ప్రజల భవిష్యత్తు మంటగలుస్తుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదని, శాంతికి విఘాతం కలిగిస్తూ, తప్పులకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కులాలు, మతాల పరంగా వాట్సాప్ గ్రూపులు ఉన్నట్లే… లా అండ్ ఆర్డర్ కోసం, స్థానిక సమస్య కోసం వాట్సాప్ గ్రూపులు ఉండాలని, ఆ దిశగా ప్రజలు ఆలోచించాలని అన్నారు. శనివారం రాత్రి కాకినాడలో మన ఊరు – మాట మంతి కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “నేరపూరిత నేపథ్యం ఉన్న వ్యక్తులు రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవులను అధిష్టించి, ప్రజల జీవితాలను శాసించాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు. అటువంటి శక్తులపై నిరంతరం తిరగబడటానికి, న్యాయం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉంటాను. వచ్చే ఎన్నికల్లో గెలుస్తానో లేదో తెలియదు కానీ ప్రజల కోసం నిరంతరం పోరాడతాను.
• అంబేద్కర్ గారిపై గౌరవం ఉంటే తప్పుడు కేసులు పెట్టరు
నిజమైన ఎస్సీ, ఎస్టీ కేసులను ఎంత బలంగా సమర్థిస్తామో, తప్పుడు కేసులను కూడా అంతే బలంగా అడ్డుకోవాలి. తప్పుడు కేసుల వల్ల అసలైన బాధితులకు అన్యాయం జరగకూడదు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిపై నిజమైన గౌరవం ఉన్నవారెవరూ తప్పుడు కేసులు పెట్టరు. కూటమిలో ఉన్న నాయకులు ఇలాంటి తప్పుడు కేసులను ప్రోత్సహించవద్దు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం దుర్వినియోగంపై కీలక తీర్పులను ఇచ్చింది. చట్టం దుర్వినియోగం కాకుండా, అమాయకులు తప్పుడు కేసులతో నలిగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే న్యాయస్థానం ఈ నిబంధనలను చేర్చింది.
• సాక్ష్యాధారాలన్నింటినీ పూర్తిగా చెరిపేశారు
2017లో సుగాలీ ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ దాదాపు లక్షన్నర మందితో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించాం. ఈ ఒత్తిడితోనే కేసును సీబీఐ విచారణకు అప్పగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. 2019-2024 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరుతూ కేవలం తూతూ మంత్రంగా లేఖ రాసి వదిలేసింది. తాము అధికారంలోకి రాగానే మొదటి కేసుగా దీనిపైనే దృష్టి పెట్టాలని భావించాం. అయితే గత ప్రభుత్వం ఈ కేసులోని కీలక సాక్ష్యాధారాలన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టేసింది. కోర్టులు ఎప్పుడూ సాక్ష్యాధారాలపైనే ఆధారపడి పనిచేస్తాయి. ఈ కేసులో అత్యంత కీలకమైన డీఎన్ఏ నమూనాలను కూడా మాయం చేసి నిందితులను రక్షించే ప్రయత్నం చేశారు. అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన సొంత నివాసంలోనే అతి దారుణంగా నరికి చంపారు. ఈ హత్య ఎవరు చేశారనే విషయం అందరికీ తెలిసినప్పటికీ, కోర్టులో నిరూపించడానికి కచ్చితమైన సాక్ష్యాధారాలు ఉండాలి. చట్టం ముందు సాక్ష్యాలు లేకపోతే ఏమీ చేయలేము. ఒక తల్లి తన కొడుకు కనిపించడం లేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తుంది. ఇందులో ఎక్కడా కుల ప్రస్థావన లేదు. క్రిమినల్స్ ను చూసేటప్పుడు కుల కోణాన్ని జోడించడం ఏ మాత్రం సరికాదు. క్రిమినల్స్ ను లేదా బాధితులను వారి కులాన్ని బట్టి కాకుండా, జరిగిన నేరాన్ని బట్టి మాత్రమే చూడాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
