
• మోడల్ పుష్కర్ పంచాయత్ అభివృద్ధికి అడుగులు
• Pawan Kalyan చొరవతో దాదాపు రూ. 7 కోట్ల అభివృద్ధి నిధులు
• అధునాతన పుష్కర ఘాట్, రోడ్లు, డ్రెయిన్లు, పారిశుధ్య నిర్వహణ సదుపాయాలతో పర్యాటక శోభ
• మొట్టమొదటి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీగా మునికూడలి
• పర్యావరణహితంగా ‘సప్త రుషి’ ఘాట్
‘స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాల’ థీమ్ తో మోడల్ పుష్కర పంచాయతీల రూపకల్పనకు ప్రణాళికలు రూపొందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఆ దిశగా పని ప్రారంభించారు. సీతానగరం మండల పరిధిలోని మునికూడలి గ్రామంలో మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయంతో దాదాపు రూ. 7 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ‘సప్త రుషి ఘాట్’ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు మునికూడలి గ్రామ సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశుధ్య నిర్వహణ, పర్యాటక ఆకర్షణల మేళవింపుతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఈ మొత్తం నిధులను వినియోగించనున్నారు. దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరా, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వ ఆమోదం లభించింది. గోదావరి కాలుష్య నివారణ పనులకు పీసీబీ నిధులు ఖర్చు చేయనున్నారు.
అందులో మునికూడలి సప్త రుషి పుష్కరఘాట్ సమీపంగా ఉన్న ఉమాపార్వతీ సోమేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పునరుద్ధరణ, మరమ్మతుల నిమిత్తం దేవాదాయ శాఖ రూ. 30 లక్షలు మంజూరు చేసింది. పుష్కరాల సందర్భంగా విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయాలు కలగకుండా నాణ్యమైన కరెంటు అందించేందుకు వీలుగా 11కేవీ ఫీడర్ తో పాటు అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, లో టెన్షన్ లైన్ల నిర్మాణం, ఇతర పనుల నిమిత్తం రూ. 1.41 కోట్లు, సప్త రుషి ఘాట్ కి ఇరువైపులా ఉన్న గోదావరి గట్టుపై సిమెంటు రోడ్డు నిర్మాణం, మునికూడలి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ర్యాంపుల నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం నుంచి రూ. 1.23 కోట్లు వెచ్చించనున్నారు.
మునికూడలి రాష్ట్రంలో మొట్టమొదటి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీగా అవతరించనుంది. కాలుష్యరహిత గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం మునికూడలి గ్రామం నుంచి విడుదల అయ్యే మురుగు నీరు నేరుగా గోదావరిలో కలవకుండా గ్రామంలో గ్రామంలో 3.4 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మిస్తున్నారు. వాటికి అనుసంధాన రహదారులు, సామాజిక ఇంకుడు గుంతలు, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణం, మొక్కలు నాటడం తదితర పనులకు రూ. 68.2 లక్షలు మంజూరయ్యాయి. దీంతోపాటు స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ నిధులతో సప్త రుషి ఘాట్ దగ్గర 20 శాశ్వత మరుగు దొడ్ల నిర్మాణం, గ్రామంలో చెత్త సేకరణ నిమిత్తం ఎలక్ట్రికల్ వాహనం ఏర్పాటు చేయనున్నారు. మరో రూ. 10 లక్షలు వెచ్చించి చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని నిర్మించనున్నారు. పూర్తి పారిశుధ్యంతో కూడిన వాతావరణం మధ్య పుష్కరాలు నిర్వహించుకునే విధంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు.
గోదావరి కరకట్ట, పుష్కరఘాట్ సమీపంలో రూ. 4 లక్షలతో పొదల తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం నిధులతో సప్త రుషి ఘాట్ కి వచ్చే భక్తులకు, మునికూడలి గ్రామ తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ. 15 లక్షలు, పంచాయతీరాజ్ శాఖ నిధులతో గ్రామం మొత్తం వీధి దీపాలు, ఏర్పాటు చేయనున్నారు. రూ. 1.78 కోట్లతో సప్త రుషి ఘాట్ లో పుష్కరాల నిమిత్తం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. పుష్కరాల సందర్భంగా రాత్రి సమయాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా భారీ ఫోకస్ లైట్లు, సుందరీకరణ దీపాల ఏర్పాటుకు రూ. 20 లక్షలు వెచ్చించనున్నారు. రూ. 15 లక్షలతో రెండు పిండ ప్రదానం షెడ్లు నిర్మించనున్నారు. మర్రిచెట్టు ఆకారంలో ఏర్పాటు చేయనున్న టెర్రకోట డయాస్ పెయింటింగ్, బస్ షెల్టర్ నిర్మాణానికి రూ. 10 లక్షలు, మరో రూ. 5 లక్షలతో పాత పాఠశాల భవనం మరమ్మతులు చేపట్టనున్నారు. వీటితోపాటు పుష్కరాల కోసం తరలివచ్చే భక్తులు సౌకర్యార్థం పార్కింగ్ ప్రదేశాలు, పుష్కరఘాట్, ఆలయాలకు వెళ్లే మార్గాల వివరాలతో కూడిన సైన్ బోర్డులు ఎక్కడిక్కడ ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు ఘాట్ సమీపంలో దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణానికి, జల్లు స్నానం ఏర్పాట్లకు రూ. 25 లక్షలు ఖర్చు చేయనున్నారు.

