
26 నుంచి తిరుమలలో సాలకట్ల జ్యేష్టాభిషేక ఉత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు జరిగే సాలకట్ల జ్యేష్టాభిషేక మహోత్సవానికి సంబంధించిన పూర్తి వివరాలను టీటీడీ వెల్లడించింది. ఈ మూడు రోజుల ఉత్సవంలో స్వామివారికి జరిగే ప్రత్యేక కవచాల అలంకరణలు, సేవల విశేషాలు, ఆర్జిత సేవల రద్దు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు సాలకట్ల జ్యేష్టాభిషేక మహోత్సవం జరగనుంది. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో జరిగే ఈ విశిష్ట క్రతువును అభిద్యేయక అభిషేకం అని కూడా పిలుస్తారు. ఉత్సవమూర్తులను పరిరక్షించే ఉద్దేశంతో ఈ సంప్రదాయాన్ని తరతరాలుగా కొనసాగిస్తున్నారు.మొదటి రోజు శ్రీ మలయప్పస్వామివారికి పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహించి వజ్రకవచాన్ని అలంకరిస్తారు. రెండవ రోజు ముత్యాల కవచం సమర్పించగా, మూడవ రోజు తిరుమంజనాదుల అనంతరం తిరిగి బంగారు కవచాన్ని అలంకరిస్తారు. ఆ తర్వాత వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం వరకు స్వామివారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో దర్శనమివ్వనున్నారు.అలాగే జ్యేష్టాభిషేకాన్ని పురస్కరించుకుని జూన్ 28న నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు.

