
భారత క్రికెట్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ గౌరవాన్ని స్వీకరించారు. గత మే నెలలో జరిగిన తొలి విడత కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన రోహిత్, రెండో విడతలో తన భార్య రితికా సజ్దేతో కలిసి విచ్చేసి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా క్రికెట్ రంగానికి అందించిన విశేష సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం రోహిత్ను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రోహిత్, మూడు ఫార్మాట్లలోనూ అద్వితీయమైన రికార్డులను నెలకొల్పారు..అదేవిధంగా టెస్టుల్లో 4,300 పైగా పరుగులు, వన్డేల్లో 11,500 కంటే ఎక్కువ పరుగులు, టీ20ల్లో 4,200 పైగా పరుగులు చేసి తన మార్క్ చూపించారు. అంతేకాదు రోహిత్ సారథ్యంలోనే భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలను కైవసం చేసుకుంది.

