
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్, కేరళకు చెందిన ప్రముఖ క్రికెటర్ ఎస్. శ్రీశాంత్కు బిగ్ రిలీఫ్ దక్కింది. అతనిపై విధించిన మూడేళ్ల నిషేధాన్ని కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) రద్దు చేసింది. కేసీఏపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు శ్రీశాంత్ బేషరతుగా క్షమాపణ చెప్పడంతో అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో శ్రీశాంత్, కేసీఏ మధ్య నడుస్తున్న వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా కేసీఏ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ గతేడాది కేరళ క్రికెట్ లీగ్ సీజన్కు ముందు శ్రీశాంత్పై కేసీఏ మూడేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా కేసీఏ ఆధ్వర్యంలో జరిగే ఎలాంటి కార్యకలాపాల్లోనూ, ముఖ్యంగా కేరళ క్రికెట్ లీగ్లో పాల్గొనే అవకాశం శ్రీశాంత్ కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే అసోసియేషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శ్రీశాంత్ తిరువనంతపురం కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. దీంతో తన వైఖరిని మార్చుకున్న శ్రీశాంత్, తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ కేసీఏకు అధికారికంగా బేషరతు క్షమాపణ లేఖను సమర్పించారు..
తాజాగా జరిగిన కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో క్షమాపణ లేఖపై సుదీర్ఘ చర్చ జరిగింది. శ్రీశాంత్ పశ్చాత్తాపాన్ని పరిగణనలోకి తీసుకున్న సభ్యులందరూ ఏకగ్రీవంగా నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో శ్రీశాంత్కు ఊరట దక్కినప్పటికీ, కేసీఏ ఒక గట్టి హెచ్చరిక జారీ చేసింది. భవిష్యత్తులో సంస్థ ప్రతిష్టకు నష్టం కలిగించేలా ప్రవర్తించినా లేదా బహిరంగ వ్యాఖ్యలు చేసినా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ పరిణామం కేరళ క్రికెట్ చరిత్రలో ఒక ముఖ్యమైన క్రికెటర్, రాష్ట్ర క్రికెట్ బోర్డు మధ్య ఉన్న సుదీర్ఘ వివాదానికి ముగింపు పలికింది.

