
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ ఏనుగు దంతాల కేసులో కీలక వివరాలను ప్రకటించారు. తన వద్ద 10 ఏనుగు దంతాలతో పాటు ఏనుగు దంతాలతో చేసిన 13 విగ్రహాలు ఉన్నాయని కేరళ అటవీ శాఖకు అధికారికంగా తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వన్యప్రాణి క్షమాభిక్ష పథకం కింద ఆయన ఈ వివరాలను స్వచ్ఛందంగా సమర్పించారు. ఈ పథకం ప్రకారం.. సరైన పత్రాలు లేని వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలోని వస్తువులను చట్టబద్ధం చేసుకునేందుకు వీలు ఉంటుంది.
అయితే, గతంలో తన వద్ద కేవలం 4 ఏనుగు దంతాలు మాత్రమే ఉన్నాయని మోహన్ లాల్ తెలిపారు. కానీ, తాజాగా మరో 6 దంతాలతో పాటు, సుమారు 46 కిలోల బరువున్న 13 దంతపు విగ్రహాల వివరాలను కూడా ఆయన అందించారు. ఈ విగ్రహాలలో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి దేవుళ్ల ప్రతిమలు ఉన్నట్లు సమాచారం. ఆయన క్షమాభిక్ష పథకం కింద వివరాలు వెల్లడించినప్పటికీ, అధికారులు మాత్రం ఈ దంతాలు, విగ్రహాలపై డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. వీటి వయసు, మూలాలు, చట్టబద్ధతను నిర్ధారించేందుకు ఈ పరీక్షలు కీలకంగా మారాయి.
ఇదిలా ఉంచితే, 2011లో మోహన్లాల్ ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఆ సమయంలోనే ఏనుగు దంతాలు బయటపడటంతో వివాదం మొదలైంది. అక్రమంగా వీటిని కలిగి ఉన్నారంటూ అటవీ శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఉపసంహరించుకోవాలనే ప్రభుత్వ ప్రయత్నాన్ని గతేడాది కేరళ హైకోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ ఏనుగు దంతాల్లో కొన్ని వారసత్వంగా, మరికొన్ని బహుమతులుగా వచ్చాయని మోహన్లాల్ వాదిస్తున్నారు.

