న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ (WWO) ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ సమావేశం విజయవంతంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేత సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం, వారి మధ్య సమన్వయం పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి WWO చైర్మన్ అండ్ ఫౌండర్ అంజన్ కర్నాటి, ఫౌండర్ అండ్ అడ్వైజర్ డాక్టర్ హరినాథ్ పోలిచెర్లా హాజరయ్యారు. అలాగే ఫౌండర్స్ రాజ్ అడ్డగట్ల, రమేష్ మునుకుట్ల, సారధి కార్యంపూడి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన టీవీ నెట్వర్క్ TV5 USA సీఈఓ శ్రీధర్ చిల్లర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేత సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాల్సిన అవసరంపై ప్రముఖులు చర్చించారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, కెనడా వంటి దేశాల్లో నేత సమాజం కోసం అనేక సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయని వారు తెలిపారు.
అయితే ఆయా సంస్థలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పరస్పరం అనుసంధానం చేయడం ద్వారా నేత సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు సమిష్టిగా పరిష్కారాలు కనుగొనవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.
నేత సమాజం ఎదుర్కొంటున్న ఆర్థిక, విద్యా, సామాజిక, సాంస్కృతిక సమస్యలపై దృష్టి సారించడంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేత సమాజాన్ని అనుసంధానం చేయడమే WWO ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేత సమాజానికి ఒక బలమైన గ్లోబల్ నెట్వర్క్ను ఏర్పాటు చేసి, భవిష్యత్ తరాలకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా WWO పనిచేస్తుందని నిర్వాహకులు వెల్లడించారు.