Find Articles

తెలుగు నేలపై చెరగని చిరునామా ఎన్టీఆర్.. అమెరికా రాజధానిలో ఘనంగా మినీ మహానాడు..

తెలుగు నేలపై చెరగని చిరునామా ఎన్టీఆర్.. అమెరికా రాజధానిలో ఘనంగా మినీ మహానాడు..

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ప్రాంతంలోని వర్జినియాలో మినీ మహానాడు ఘనంగా జరిగింది. స్థానిక ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొనగా, జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లికి గీతాలాపనలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భానుప్రకాష్ మాగులూరి అధ్యక్షతన జరిగిన ఈ మినీ మహానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. అమెరికాలో ఎన్నారై టీడిపి విభాగాన్ని నడిపిస్తున్న జయరాం కోమటి సహకారంతో మహానాడు ఏర్పాటైంది.

ఈ కార్యక్రమంలో భాగంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ…”తెలుగు నేలపై చెరగని చిరునామా ఎన్టీఆర్ అని చెప్పారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న అది ప్రజాహితమేనని, సంచలనమేనని పేర్కొన్నారు. సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి, సామాజిక న్యాయాన్ని చిత్తశుద్ధితో అమలుచేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కునే కాదు… రాజ్యాధికారాన్నీ కట్టబెట్టారని తెలిపారు. మే 28 కేవలం ఎన్టీఆర్ పుట్టిన రోజు మాత్రమే కాదని, తెలుగు జాతి ఆత్మగౌరవం మేల్కొన్న రోజని వెల్లడించారు. ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత మూడో తరం నేత నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా భాద్యతలు స్వీకరించడంతో ఈ సారి మహానాడు మరింత ప్రత్యేకతను సంతరించుకుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు చర్యలను పాటిస్తూ… మహానాడును దేశానికే ఆదర్శవంతంగా టీడీపీ అధిష్టానం నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.

అనంతరం భానుప్రకాష్ మాగులూరి మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని విశ్వసించిన ఎన్టీఆర్ పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. తరువాత చంద్రబాబు దూరదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తు్న్నారని పేర్కొన్నారు. లోకేష్ కొత్తతరం నాయకత్వంతో మరింత ఆధునిక దిశగా అడుగులు వేస్తున్నారని భాను ప్రకాష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మన్నే సత్యనారాయణ, జానకిరామ్ భోగినేని, రమేష్ అవిర్నేని, కిషోర్ కంచెర్ల, పయ్యావుల చక్రవర్తి సహా పలువురు ప్రముఖులు, ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

ManaTV Team