Find Articles

‘పుత్రోత్సాహం’.. తండ్రిగా గర్వపడుతున్నానంటూ చిరంజీవి భావోద్వేగ ట్వీట్

‘పుత్రోత్సాహం’.. తండ్రిగా గర్వపడుతున్నానంటూ చిరంజీవి భావోద్వేగ ట్వీట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కుమారుడు రామ్ చరణ్‌ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అని పిలవడంపై మెగాస్టార్ చిరంజీవి ఉప్పొంగిపోయారు. ఒక తండ్రిగా గర్వపడుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సుమతీ శతకంలోని ఓ పద్యాన్ని ఆయన ఉటంకించడం విశేషం.

‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ’ అనే పద్యాన్ని పోస్ట్ చేసిన చిరంజీవి.. కొడుకు పుట్టినప్పుడు కాకుండా, అతని గొప్పతనాన్ని చూసి ప్రజలు మెచ్చుకున్నప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుందని చెప్పారు. ఇటీవలే ‘పెద్ది’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్, రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ, రామ్ చరణ్‌ను ప్రశంసించారు.

ప్రధాని పాల్గొన్న వేదికపై రామ్ చరణ్‌కు దక్కిన గౌరవం చూసి, ఒక తండ్రిగా గర్వంగా ఉందని చిరంజీవి తన పోస్ట్‌లో తెలిపారు. తన కృషి, అంకితభావంతో చరణ్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. ఈ సందర్భంలోనే రామ్ చరణ్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌ గా మారింది.

ManaTV Team