
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు తలైవా173 అనే వర్కింగ్ టైటిల్ తో ఉన్న ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆపరేషన్ థియేటర్లో రజనీకాంత్, చేతిలో సర్జికల్ బ్లేడ్తో నిల్చొని ఉండగా… ఆయన కాలు కింద ఒక రౌడీ పడి ఉన్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. దీంతో ఈ సినిమాలో రజనీ డాక్టర్గా కనిపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. టైటిల్ పోస్టర్ను షేర్ చేస్తూ కమల్ హాసన్ ‘ధర్మమే వెల్లుమ్!’ (ధర్మమే గెలుస్తుంది) అని ట్వీట్ చేశారు.
నిజానికి ఈ ప్రాజెక్టుకు మొదట డైరెక్టర్ గా సుందర్ సిని ప్రకటించారు. కానీ ఆయన తప్పుకోగా, సీబీ చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. కానీ అనూహ్యంగా ఆయన కూడా ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. ఈ క్రమంలోనే ‘డ్రాగన్’ ఫేమ్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ, అశ్వత్ మరిముత్తు దర్శకత్వ బాధ్యతలను స్వీకరించారు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీతలు అనిబరివ్ ద్వయం స్టంట్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

