Find Articles

ఫ్రీ ఫైర్ మాయలో మైనర్లు.. హైదరాబాద్ నుంచి బీహార్‌కు బయల్దేరిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు

ఫ్రీ ఫైర్ మాయలో మైనర్లు.. హైదరాబాద్ నుంచి బీహార్‌కు బయల్దేరిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు

హైదరాబాద్: ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం చిన్నారులను ఎంతటి ప్రమాదంలోకి నెట్టివేయగలదో హైదరాబాద్‌లో వెలుగుచూసిన తాజా ఘటన మరోసారి స్పష్టం చేసింది. ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ ‘ఫ్రీ ఫైర్’ ద్వారా పరిచయమైన అపరిచితుల మాటలు నమ్మిన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి వెళ్లి బీహార్ చేరుకునేందుకు ప్రయత్నించగా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పోలీసుల సమన్వయంతో సురక్షితంగా రక్షించబడ్డారు.

ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు బాలికలు స్థానిక పాఠశాలలో 8వ, 9వ తరగతులు చదువుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లకు అలవాటు పడిన వారు కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లలో ‘ఫ్రీ ఫైర్’ గేమ్ ఆడటం ప్రారంభించారు. ఈ క్రమంలో బీహార్‌కు చెందిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయం ఏర్పడింది.

రోజురోజుకూ ఆ పరిచయం మరింత పెరిగి, గంటల తరబడి చాటింగ్‌లు, ఫోన్ సంభాషణలు సాగాయి. ఇంట్లో తల్లి గేమ్స్ ఎక్కువగా ఆడొద్దని మందలిస్తోందని బాలికలు వారికి చెప్పడంతో, ఆన్‌లైన్ కేటుగాళ్లు దానిని అవకాశంగా మలచుకున్నారు. “మా దగ్గరకు వచ్చేయండి.. ఇక్కడ చాలా ఫోన్లు ఉన్నాయి.. రోజంతా ఫ్రీ ఫైర్ ఆడుకోవచ్చు” అంటూ వారిని ప్రలోభపెట్టినట్లు తెలిసింది.

జూన్ 22న తల్లి మరోసారి మందలించడంతో మనస్తాపానికి గురైన బాలికలు ఇంటి నుంచి బయటకు వెళ్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుని బీహార్ వెళ్లే రైలు ఎక్కారు. సాయంత్రం వరకు పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలికలు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ఫ్రీ ఫైర్ గేమ్ ఐడీలు, సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా విచారణ చేపట్టారు. గేమ్ ఐడీ ద్వారా నగరానికి చెందిన ఓ బాలుడిని గుర్తించి ప్రశ్నించగా, బాలికలు బీహార్ వెళ్లినట్లు కీలక సమాచారం లభించింది.

అదే సమయంలో రైలు ప్రయాణంలో ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి బాలికలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బీహార్‌లోని వ్యక్తులకు సందేశాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, ఐపీ అడ్రస్‌లు, మొబైల్ లొకేషన్‌ల విశ్లేషణ ద్వారా వారు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నట్లు నిర్ధారించారు.

దీంతో రైల్వే పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు పోలీసులను అప్రమత్తం చేశారు. రైలు ఏలూరు రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే తనిఖీలు నిర్వహించిన పోలీసులు ముగ్గురు బాలికలను గుర్తించి సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి

సైబర్ ముఠాల చేతుల్లో పడకముందే బాలికలను రక్షించిన పోలీసుల అప్రమత్తతను నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఘటన ఆన్‌లైన్ గేమింగ్, సోషల్ మీడియా పరిచయాల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.

ManaTV Team