
టీ20 ప్రపంచ ఛాంపియన్ అయిన భారత జట్టు, పసికూన ఐర్లాండ్ చేతిలో 0-2 తేడాతో సిరీస్ కోల్పోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని టీమ్ లోకి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. దీనిపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డచ్కేట్ స్పందించారు.
వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డచ్కేట్ చెప్పారు. కానీ, మూడు నెలల క్రితం మనం ప్రపంచకప్ గెలవడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్లో కూడా అతను బాగా రాణించారని తెలిపారు. టీమ్ లోని ప్లేయర్స్ అందరిలోనూ ఆత్మవిశ్వాసం నింపడం, వారికి సుదీర్ఘ అవకాశాలు ఇవ్వడం తమ విధానమని చెప్పుకొచ్చారు. అందరిలాగే తాము కూడా వైభవ్ను ఆడించాలని ఉత్సాహంగా ఉన్నాం. కానీ, అతను కూడా అదే ప్రక్రియను దాటుకుని రావాలని పేర్కొన్నారు. సిరీస్ ప్రారంభానికి ముందు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
ప్రస్తుతం టీమిండియా తదుపరి టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనుంది. జులై 1 నుంచి చెస్టర్-లీ-స్ట్రీట్లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలోనైనా వైభవ్కు అవకాశం దక్కుతుందేమోనని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈ సిరీస్లో వైభవ్ అరంగేట్రం చేస్తే, అతి పిన్న వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ప్లేయర్ గా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేస్తారు. అయితే, టీమ్ యాజమాన్యం మాత్రం ప్రతిభ కన్నా అనుభవం, ప్రక్రియకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వైభవ్ ఎంట్రీపై సందిగ్దత నెలకొంది.

