Find Articles

రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తామని నటుడికి డైరెక్టర్ వార్నింగ్!

రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తామని నటుడికి డైరెక్టర్ వార్నింగ్!

కిరణ్‌రావు దర్శకత్వంలో వచ్చి ఆస్కార్స్ రేసు వరకు వెళ్లిన సూపర్ హిట్ చిత్రం ‘లాపతా లేడీస్’. ఈ సినిమాలో ‘చోటూ’ పాత్రతో మెప్పించిన నటుడు సత్యేంద్ర సోనికి ఇండస్ట్రీలో ఘోర అవమానం జరిగింది.

రెమ్యునరేషన్ అడిగినందుకు ఒక డైరెక్టర్ నడిరోడ్డుపై తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని సత్యేంద్ర సోని కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాదు తనను చంపేస్తామని బెదిరించారంటూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో జరుగుతున్న ‘పేడ్ పాల్కి’ చిత్ర షూటింగ్ స్పాట్‌లో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.

‘పేడ్ పాల్కి’ సినిమాకు పుష్పేంద్ర సింగ్ దర్శక-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా సైనింగ్ అమౌంట్‌గా రూ. 50,000 ఇచ్చిన చిత్ర యూనిట్, మిగిలిన మొత్తాన్ని షూటింగ్ ముగిశాక ఇస్తామని ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది. దాదాపు 8 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న సత్యేంద్ర, తన మిగిలిన డబ్బుల గురించి అడగడంతో డైరెక్టర్ పుష్పేంద్ర ఆగ్రహంతో ఊగిపోయారు. 10 నిమిషాల్లో హోటల్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని, మళ్లీ ఇక్కడ కనిపిస్తే చంపేస్తానని హెచ్చరించారు. ఆ సినిమా హీరోయిన్, డైరెక్టర్ భార్య అయిన ప్రగతి చౌహాన్ కూడా తనను బూతులు తిడుతూ హోటల్ నుంచి గెంటివేశారని సత్యేంద్ర వాపోయారు.

అంతటితో ఆగకుండా, హోటల్ నుంచి బయటకు వచ్చేసిన తనతో పాటు శ్రీధర్ దూబే, పంకజ్ శర్మలను డైరెక్టర్ పుష్పేంద్ర, ఆయన భార్య కారులో వెంబడించారని సత్యేంద్ర తెలిపారు. నడిరోడ్డుపై తమను అడ్డుకుని మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అనంతరం విచక్షణరహితంగా దాడి చేశారని చెప్పారు. అడ్డువచ్చిన తోటి నటులను కూడా చితకబాదారని పేర్కొన్నాడు. దీంతో సత్యేంద్ర, రైల్వే స్టేషన్ నుంచి ఇన్‌స్టా లో లైవ్ పెట్టి తన బాధను పంచుకున్నారు. అయితే, ఈ వీడియో వైరల్ కావడంతో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) తీవ్రంగా స్పందించింది. నటుడికి మద్దతుగా నిలిచింది. సదరు దర్శకుడు, నిర్మాతలపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌ను డిమాండ్ చేసింది.

ManaTV Team