
ప్రముఖ నటి శృతి హాసన్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. చెన్నైలో కొనుగోలు చేసిన కొత్త ఇంట్లోకి ఆమె అడుగుపెట్టారు. నూతన గృహంలో సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
ఈ పూజా కార్యక్రమంలో శృతిహాసన్ చాలా నిరాడంబరంగా, సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఇక పూజలో కూర్చున్న ఫొటోలతో పాటు ఈ సందర్భంగా సిద్ధం చేసిన పిండివంటలు, కొత్త ఇంటి తాళాలను కూడా ఆమె షేర్ చేశారు. చెన్నైలో ఆమె కొత్త ప్రయాణం ప్రారంభించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.
అయితే , ఈ ముఖ్యమైన కార్యక్రమానికి తండ్రి, ప్రముఖ నటుడు కమల్ హాసన్, సోదరి అక్షర హాసన్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరుకాకపోవడం గమనార్హం. కేవలం కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుకను నిరాడంబరంగా పూర్తి చేశారు. వారి గైర్హాజరుకు గల కారణాలపై హాసన్ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా ముంబై, చెన్నై మధ్య ప్రయాణాలు చేస్తూ గడిపిన శ్రుతి, ఇప్పుడు చెన్నైలో స్థిరపడటం ఆమె నగరంతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోంది.
కెరీర్ పరంగా చూస్తే.. శృతి హాసన్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో మెరిశారు. ప్రస్తుతం ఆమె విజయ్ సేతుపతితో కలిసి మిస్కిన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ట్రైన్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వీటితో పాటు ‘ఆకాశంలో ఒక తార’ అనే మరో చిత్రం, పలు మ్యూజిక్ ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉన్నారు.

