Find Articles

న్యూయార్క్‌లో కోలాహలంగా NYTTA బోనాల జాతర.. ప్రవాసంలో ప్రతిబింబించిన తెలంగాణ సంస్కృతి!

న్యూయార్క్‌లో కోలాహలంగా NYTTA బోనాల జాతర.. ప్రవాసంలో ప్రతిబింబించిన తెలంగాణ సంస్కృతి!

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో అమెరికాలోని స్థానిక ఐసెన్ హోవర్ పార్క్‌లో బోనాల జాతర అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పల్లె వాతావరణాన్ని తలపిస్తూ నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లు చేసి దిగ్విజయం చేశారు.

వేడుకల్లో భాగంగా పద్మ కోడెల చేతుల మీదుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి అలంకరణ, డెకొరేషన్, మహంకాళి గుడి, బోనాల తయారీతో పాటు పోతురాజు వేషధారణలో అశోక్ చింతకుంట చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి జాతరకు మరింత ఆధ్యాత్మిక శోభను, ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ఈ సంబరాల్లో తెలంగాణ జానపద కళా వైభవాన్ని చాటుతూ ప్రముఖ కళాకారులు, కవులు, గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, రచయిత-గాయకుడు మిట్టపల్లి సురేందర్ మరియు ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్య యాటలు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

ఈ వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసేందుకు నైటా నిరంతరం కృషి చేస్తోందని, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రవాస భారతీయులలో ఐక్యతను, అనుబంధాన్ని మరింత బలపరుస్తాయని తెలిపారు.

ManaTV Team