Find Articles

సందీప్ కిషన్ భారీ ఫాంటసీ ప్రాజెక్ట్ ‘కరికాల’.. రెండు భాగాలుగా పాన్ ఇండియా రిలీజ్

సందీప్ కిషన్ భారీ ఫాంటసీ ప్రాజెక్ట్ ‘కరికాల’.. రెండు భాగాలుగా పాన్ ఇండియా రిలీజ్

యంగ్ హీరో సందీప్ కిషన్ తన సినీ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘కరికాల’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఫస్ట్ లుక్‌లో సందీప్ కిషన్ శక్తివంతమైన యోధుడి పాత్రలో రాజసంగా కనిపించారు. అడవి నేపథ్యంలో గుర్రంపై కూర్చొని, చేతిలో కత్తితో గంభీరంగా కనిపించిన ఆయన లుక్‌కు పక్కనే సింహం ఉండటం పోస్టర్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విజువల్స్ సినిమా కథ భారీ స్థాయిలో ఉండబోతోందనే సంకేతాలను ఇస్తున్నాయి. ఈ చిత్రానికి ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న ఈ సినిమాను అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, విస్తృతమైన వరల్డ్ బిల్డింగ్‌తో రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఫాంటసీ జానర్‌లో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

‘కరికాల’ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. చాప్టర్-1ను 2027 జూలై 2న, చాప్టర్-2ను 2027 అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్, ఇతర ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

ఇక సందీప్ కిషన్ ప్రస్తుతం ‘సిగ్మా’ సినిమా విడుదల కోసం కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘కరికాల’ ప్రకటన ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా మారి, ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఇప్పుడు ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే, పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ‘కరికాల’ ప్రత్యేక ముద్ర వేయాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ManaTV Team