
టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్కు ఊహించని షాక్ ఎదురైంది. రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బెల్ఫాస్ట్లో జరిగిన తొలి మ్యాచ్లో34 పరుగుల తేడాతో టీమిండియాను ఐర్లాండ్ జట్టు చిత్తు చేసింది. ఈ విజయంతో ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటివరకు ఏ ఫార్మాట్లోనూ భారత్పై గెలవని ఆ జట్టు, ఈ మ్యాచ్తో ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఐర్లాండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు 18.5 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ లార్కన్ టక్కర్ హాఫ్ సెంచరీతో టీమ్ కు బలమైన పునాది వేశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్లతో నిండిన లైనప్ ఐర్లాండ్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 50 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశారు. మిగతా బ్యాటర్లు అతనికి సరైన సహకారం అందించకపోవడంతో భారత టీమ్ ఓటమి ఖాయమైంది. ఐర్లాండ్ బౌలర్లలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మాథ్యూ హంఫ్రీస్, మాట్ హాలార్డ్ చెరో మూడు వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించారు. అరంగేట్ర బౌలర్ జై మూంద్రా కూడా రెండు కీలక వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
అయితే, భారత ఓటమిపై అభిషేక్ శర్మ స్పందించారు. పరిస్థితులకు త్వరగా అలవాటు పడకపోవడమే తమ పరాజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. వరుసగా మ్యాచ్లు ఆడేటప్పుడు, ప్రాక్టీస్ సెషన్లలోనే పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. కానీ ఒక బలమైన టీమ్ గా ఉండి కూడా తాము త్వరగా అలవాటు పడటంలో ఫెయిల్ అయినట్లు తెలిపారు.

