Find Articles

MATA’ వేడుకల్లో వైభవంగా భద్రాద్రి రామయ్య కల్యాణం, పట్టాభిషేకం!

MATA’ వేడుకల్లో వైభవంగా భద్రాద్రి రామయ్య కల్యాణం, పట్టాభిషేకం!

గ్రేటర్ ఫిలడెల్ఫియా (పెన్సిల్వేనియా): ప్రవాస తెలుగువారి ప్రతిష్టాత్మక సంస్థ ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా కన్వెన్షన్ మహాసభలు సరికొత్త చరిత్రను సృష్టించాయి. పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్‌లో జూన్ 19, 20 తేదీల్లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో.. లోకకల్యాణం కోసం నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం మరియు పట్టాభిషేక మహోత్సవం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. తొలిసారిగా భద్రాచల అర్చకులతో పట్టాభిషేకం.. ఈ ఆధ్యాత్మిక వేడుక విశిష్టత గురించి MATA కన్వీనర్ శ్రీధర్ గూడాల మాట్లాడుతూ.. “భద్రాచలం పుణ్యక్షేత్రం నుంచి స్వయంగా తరలివచ్చిన ప్రధాన అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ పద్ధతుల మధ్య శ్రీ సీతారాముల కల్యాణం, ఆపై రామయ్య తండ్రి పట్టాభిషేక మహోత్సవం అత్యంత అద్భుతంగా జరిగాయి. అమెరికా గడ్డపై భద్రాచల క్షేత్ర అర్చకుల ఆధ్వర్యంలో ఈ తరహాలో పట్టాభిషేకం జరగడం ఇదే మొదటిసారి. ప్రవాస తెలుగువారి చరిత్రలో ఇదొక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చారిత్రాత్మక ఘట్టం” అని ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

భక్తులతో పోటెత్తిన ఎక్స్‌పో సెంటర్

అచ్చ తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా ముస్తాబైన ఈ వేడుకకు అమెరికాలోని నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, వేద పండితుల ఆశీర్వచనాల మధ్య జరిగిన ఈ క్రతువుతో ఫిలడెల్ఫియా నగరంలో సాక్షాత్తు ఆ భద్రాద్రి రాముడే కొలువై ఉన్నాడా అనేలా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ చారిత్రాత్మక వేడుకను వీక్షించిన భక్తులందరూ MATA ప్రతినిధుల కృషిని, ఏర్పాట్లను ముక్తకంఠంతో అభినందించారు.

 

 

ManaTV Team