
జనసేన సిద్ధాంతాలను విశ్వసించే నడిచినవారితో సంస్థాగత నిర్మాణం
• జనసేన అనేది నిరంతర ప్రవాహంలా కళ కళ లాడాలి
• ఆంధ్రప్రదేశ్ కు భావి నాయకత్వం అందించే ప్రక్రియకు శ్రీకారం
• రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు పథకం ప్రకారం సాగుతున్నాయి
• ఆ కుట్రలు చేస్తున్నవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి
• వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చినా వారి నైజం మారలేదు
• రాజకీయాలకు కులాన్ని ముడిసరకుగా వాడుకోను
• అన్ని కులాల ఆమోదంతోనే చరిత్ర సృష్టించగలం
• యువతకు ఉచితాలు కాదు.. గౌరవమైన జీవనం కావాలి
• జనసేన పార్టీ సంక్షేమ పథకాలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు
• ప్రజాస్వామ్యయుతంగా జనసేన పార్టీ నిర్మాణం
• ప్రతి విషయంపైనా నాయకులు బలంగా మాట్లాడాల్సిందే
• జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కార్యాచరణ సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్
దేశంలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టారు. ప్రత్యేక కారణాలతో కొన్ని.. సిద్ధాంతాలు, భావజాలంతో మరికొన్ని నెలకొల్పి ఉండొచ్చు. జనసేన పార్టీ మాత్రం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడిన బలమైన సమూహంతో మూలాలను బలపర్చుకోవాలని మొదటి నుంచి భావించాను. పుష్కర కాలంపాటు నాతో నడిచి, పార్టీ సిద్ధాంతాల కోసం తపనపడిన సమూహంతో ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నాను. ఏదో రకంగా కమిటీలను వేసి, పార్టీని నడిపించడం పెద్ద కష్టం కాదు.. కానీ జనసేన పార్టీ నాయకత్వం, కార్యకర్తలు సిద్ధాంతాల కోసం కడదాకా నిలబడేలా ఉండాలని భావించాన’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన ప్రస్థానం చిన్న కాలువ మాదిరి ప్రారంభం అయింది.. నేడు వాగు ప్రవాహం మాదిరిగా విస్తరించింది.. అది మరింత ఉదృతమై నిత్య ప్రవాహంతో కళకళలాడాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కార్యాచరణ సమావేశం శనివారం మంగళగిరిలో జరిగింది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘రాజకీయ పార్టీ జీవన కాల మనుగడకు బలమైన సిద్దాంతాన్ని నమ్మే ముడిసరకు కావాలి అనే మొదట్లోనే అనుకున్నాను. అది పార్టీకి పునాదిగా ఉపయోగపడుతుంది. ఓ వ్యక్తి బలమైన ఆలోచన నుంచే వ్యవస్థ తయారవుతుంది. తర్వాత ఆ వ్యవస్థ ఎంతోమందిని తయారు చేస్తుంది. విజయాలకు, అపజయాలకు అతీతంగా కాలాన్ని ఎదురించి మరీ నాకు అండగా నిలబడిన నా సమూహానికి ధన్యవాదాలు. పార్టీకి 22 లక్షల మంది ఉద్యమిలను తయారు చేయడానికి, 18 వేల మంది సాధక్స్ నిరంతరం శ్రమించారు.

