
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. ఏటా జ్యేష్ఠ మాసంలో ప్రారంభించి, కార్తీక మాసంలో దీక్ష విరమిస్తారు.గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం తప్పకుండా ప్రతి ఏటా చేస్తున్నారు. నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలు ధరిస్తారు. ఎక్కువగా చందన వర్ణ వస్త్రధారణను అవలంబిస్తుంటారు. నిత్యం అనుష్ఠానం, దేవతారాధనగావిస్తారు. సమయానుకూలంగా ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు.

