
అమెరికా పౌరసత్వం (US Citizenship) పొందాలనుకునే వలసదారులకు భారీ షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump నేతృత్వంలోని ప్రభుత్వం సిటిజన్షిప్ దరఖాస్తు ఫీజులను భారీగా పెంచే ప్రతిపాదనను తీసుకువచ్చింది. ప్రస్తుతం 760 డాలర్లుగా ఉన్న పౌరసత్వ దరఖాస్తు (N-400) ఫీజును 1,330 డాలర్లకు పెంచాలని నిర్ణయించింది. అంటే దాదాపు 80 శాతం పెరుగుదల అన్నమాట.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఊరట లేకుండా 1,280 డాలర్ల ఫీజు విధించాలని ప్రతిపాదించారు. దీంతో అమెరికా పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మంది వలసదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
ఇప్పటివరకు తక్కువ ఆదాయం కలిగిన దరఖాస్తుదారులకు అందుతున్న ఫీజు రాయితీలను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా పౌరసత్వ దరఖాస్తు తిరస్కరించబడినప్పుడు అప్పీల్ చేసుకునేందుకు చెల్లించాల్సిన ఫీజును కూడా పెంచే అవకాశం ఉంది.
అయితే అమెరికా సైన్యంలో సేవలందించిన మాజీ సైనికులకు మాత్రమే ఫీజు మినహాయింపు కొనసాగించనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై 60 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికా పౌరసత్వం పొందడం మరింత ఖరీదైన ప్రక్రియగా మారనుందని వలసదారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు, కొత్త వలసదారులు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

