ఏపీ అగ్నిగుండంలా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో, చేపట్టాల్సిన సన్నద్ధత చర్యలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హీట్వేవ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట్ల టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వీటి ద్వారా ప్రజలకు చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎండల తీవ్రత అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎండల తీవ్రత, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని నిర్దేశించారు.