– పొదుపు, వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ సూచన
– ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పరిశీలిస్తున్నామన్న చంద్రబాబు
– త్వరలో మార్గదర్శకాల రూపకల్పన
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇంధన సంక్షోభాన్ని నివారించే ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తుంది.
ఏపీ ప్రభుత్వ రంగంలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.భవిష్యత్తులో ప్రపంచమంతా ఇంటి నుంచే పనిచేసే రోజులు రాబోతున్నాయన్నారు. దానికి అనుగుణంగా మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని పేర్కొన్నారు.ఇంధన పొదుపే లక్ష్యంగా అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. అదేవిధంగా టెలి, వీడియో కాన్ఫరెన్స్లకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలుకు సంబంధించిన ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొందరికి పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్, మరికొందరికి హైబ్రిడ్ విధానంలో అంటే కొన్ని రోజులు ఇల్లు, కొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించే అంశాలను పరిశీలిస్తున్నారని సమాచారం.ఈ ప్రతిపాదనలపై కేబినెట్ సమావేశంలో చర్చించి, త్వరలోనే మార్గదర్శకాలను రూపొందిస్తారని సమాచారం.అయితే దీనిపై పూర్తి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.