– విదేశాల్లో హిందూ ధర్మ వ్యాప్తి
– లాటిన్ అమెరికాలోనే మొదటిసారిగా గణేశుడి విగ్రహా ప్రతిష్ట
విదేశాల్లో హిందూ ధర్మం వేగంగా విస్తరిస్తోంది. ఇది కేవలం మతంలా కాకుండా ఒక ఆధ్యాత్మిక జీవన విధానంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఈ క్రమంలోనే లాటిన్ అమెరికాలో ఒక చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. అక్కడ మొట్టమొదటి వినాయక విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
బ్రెజిల్ లోని పెట్రో పోలీస్ నగరంలోని సెంట్రో కల్చరల్ విశ్వ విద్యా ఆశ్రమ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భారతీయ సంప్రదాయ పద్ధతుల ప్రకారం, వేద మంత్రోచ్ఛారణల మధ్య కన్నుల పండువగా గణేశుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి భక్తులు, ప్రవాస భారతీయులతో పాటు బ్రెజిల్లోని భారత రాయబారి దినేష్ భాటియా, విశ్వనాథగా ప్రసిద్ధి చెందిన బ్రెజిలియన్ వేదాంత గురువు జోనాస్ మసెట్టి హాజరయ్యారు. కాగా ఇది అక్కడి హిందువులకు ముఖ్యమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.