
టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా నిలిచిన దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు.మే 30న ఆయన వర్ధంతి కాగా, ఆయన సమాధి పరిస్థితిపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. సంరక్షణ కరువై, పిచ్చిమొక్కలు, చెత్తతో నిండిన సమాధి దృశ్యాలు వైరల్ గా మారాయి. దీంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాసరి నారాయణరావు, ఆయన భార్య పద్మ సమాధులు ఉన్న ప్రదేశం పూర్తిగా నిర్లక్ష్యానికి గురికావడం శోచనీయం. చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి, చెత్తాచెదారం పేరుకుపోయి ఉన్న హృదయవిదారక దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.మే 30న ఆయన వర్ధంతి రోజే దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ఒక లెజెండరీ డైరెక్టర్కు ఇలాంటి పరిస్థితి రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.ఈ దృశ్యాలను చూసిన హీరో మంచు మనోజ్, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రంగంలోకి దిగారు. సిబ్బందితో కలిసి స్వయంగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసే పనులను పర్యవేక్షించారు. అనంతరం దాసరి, పద్మ సమాధులకు నివాళులర్పించారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు దశాబ్దాల పాటు సేవలందించిన దాసరి స్మారకానికి జరిగిన అగౌరవం, ఆ తర్వాత పరిశ్రమ వర్గాలు వెంటనే స్పందించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

