Find Articles

బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో.. పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు

-గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో వేడుక
-జిడబ్ల్యూటిసిఎస్ ‘MLC’ మ్యూజికల్ అండ్ కామెడీ షో

బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పెద్దలు, చిన్నారులు సందడి చేశారు. ఇందులో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు , యుగళ గీతాలు, నృత్య ప్రదర్శనలతో పాటు, సినీ రచయిత అనంత్ శ్రీరామ్ సారథ్యంలో సంగీతం, సాహిత్యం, హాస్య కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాలన్నీ తెలుగు వారందరినీ ఆకట్టుకున్నాయని ఆ సంస్థ అధ్యక్షులు రవి అడుసుమిల్లి తెలిపారు.

ఈ నెల 9న సాయంత్రం నాలుగు గంటల నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమాలు రాత్రి ఒంటి గంట వరకూ నిరంతరంగా సాగాయి. రకరకాల వేషధారణతో.. చిన్నారుల పలు నృత్య కార్యక్రమాలు అన్ని తరాల వారిని ఆకట్టుకున్నాయి. ఉగాది పండుగ ఘన సంప్రదాయాన్ని చాటి చెప్పే పలు రకాల తెలుగింటి వంటకాలతో విందును సభికులకు అందించారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు రవి మాట్లాడుతూ.. ఎల్లలు లేనిది మన మాతృబాష తెలుగని చెప్పారు. అనాదిగా తెలుగు భాష వైభవం, కళా, సంస్కృతీ సంప్రదాయాలను సరిహద్దులను దాటించి, ఈనాడు లక్షలాది మంది తెలుగు వారు నివసిస్తున్న ఉత్తర అమెరికాలో రాజధాని ప్రాంత వేదికగా ప్రతి తెలుగింటి పండుగను జరుపుకోవడం గొప్ప విషయమన్నారు. తెలుగు భాషను సజీవంగా నిలబెడుతున్న వేదికలు, సంఘాలలో అగ్ర తాంబూలం బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘానికి దక్కుతుందని తెలిపారు. స్వర్ణోత్సవాలను జరుపుకున్న ఈ సంస్థ, యువ వారసత్వంతో మరో స్వర్ణోత్సవ కాలం పాటు ఈ పరంపరను కొనసాగిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరిస్తున్న దాతలను, యువ వాలంటీర్లను అభినందించారు.

అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన చింతలపూడి శాసన సభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల ప్రవాస సంస్థగా ఇంతింతై అటుడింతై అన్నట్లు ఎదిగి ఎన్నో ప్రవాస సంఘాలకు బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈతరం చిన్నారులకు సంస్కృతీ, సంప్రదాయాలను అందించే ఈ వేదిక చిరకాలం నిలవాలని ఆకాంక్షించారు. అలాగే హాజరైన వందలాది మంది తెలుగింటి మహిళలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. మాతృభూమి, మాతృభాష రెండు కళ్లుగా భావిస్తూ, ఏ దేశమేగినా మన కట్టు, బొట్టు, మూలలను మర్చిపోకుండా.. మన సంస్కృతిని కాపాడుకుంటూ, వృత్తి ఉపాధి, వ్యాపార రీత్యా రాణిస్తున్న ప్రవాస తెలుగు వారందరినీ అభినందించారు.

పూర్వ అధ్యక్షులు త్రిలోక్ కంతేటి, మన్నే సత్యనారాయణ, సుధా పాలడుగు, కృష్ణ లాం, సంస్థ కార్యవర్గ సభ్యులు సుశాంత్ మన్నే, రాజేష్ కాసారనేని, యశస్వి బొద్దులూరి, భానుప్రకాష్ మాగులూరి, గంగ శ్రీనివాస్, విజయ్ అట్లూరి, యువ సిద్ధార్ధ్ బోయపాటి, పద్మజ బేవర , శ్రీవిద్య సోమ, పావని తదితరులు సభికులకు ధన్యవాదములు తెలిపారు. భాష, సంస్కృతిని కాపాడుకోవటం, కళను ప్రోత్సహించటం, కళాకారులను సత్కరించటం తెలుగింటి సంప్రదాయమని స్పష్టం చేశారు.

ManaTV Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *