
అమెరికాలో కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా అయోవాలో మస్కటీన్ లోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకోగా, ఏడుగురు మృత్యువాతపడ్డారు. వారిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్లు మస్కటీన్ పోలీసులు తెలిపారు.
పార్క్ అవెన్యూలోని ఓ నివాసంలో కాల్పులు చోటు చేసుకున్నాయని సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ తుపాకీ గాయాలతో ఉన్న నలుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు మస్కటీన్ కు చెందిన ర్యాన్ విల్లీస్ గా గుర్తించారు. అయితే పోలీసుల రాకను గమనించిన విల్లీస్ అక్కడి నుంచి పరార్ అయ్యాడు. అతడి కోసం గాలిస్తుండగా.. మరో ప్రాంతంలో తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. మరోవైపు మస్కటీన్ లోని ఓ నివాసంలో, గ్రాండ్ వ్యూ అవెన్యూలోని ఓ వ్యాపార సముదాయంలో తుపాకీ గాయాలతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. నిందితుడితో సహా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఈ కాల్పులు జరిగాయని ప్రాథమికంగా అంచనా వేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

