అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, ఓక్లాండ్ అరెనా వేదికగా ప్రతిష్టాత్మక సంస్థ సిలికాన్ ఆంధ్రా నిర్వహిస్తున్న ‘సిలికాన్ ఆంధ్రా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్’ జూలై 31 నుంచి ఆగస్టు 1, 2026 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. సంస్థ 25 ఏళ్ల సాంస్కృతిక సేవలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ రజతోత్సవాల్లో తెలుగు సంస్కృతి, భారతీయ సంప్రదాయాలు, సంగీత వైభవం ప్రతిధ్వనించనున్నాయి.
ఈ వేడుకల్లో భారతదేశానికి చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, లయ దిగ్గజాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను అలరించిన పలువురు ప్రముఖులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు.
పాల్గొననున్న ప్రముఖులు
డా. త్రిచి శంకరన్: అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన మృదంగ విద్వాంసుడు, సంగీత కళానిధి డా. త్రిచి శంకరన్ తన విశిష్ట లయ ప్రదర్శనతో సంగీతాభిమానులను అలరించనున్నారు.
విద్వాన్ పత్రి సతీష్ కుమార్: సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ మృదంగ విద్వాంసుడు పత్రి సతీష్ కుమార్ తన లయ విన్యాసాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
కళైమమణి తిరువారూర్ వైద్యనాథన్: సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ఘటమ్ విద్వాంసుడు కళైమమణి తిరువారూర్ వైద్యనాథన్ తన వినూత్న లయ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించనున్నారు.
విదుషి సుధా రఘునాథన్: పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ కర్ణాటక సంగీత విదుషి సుధా రఘునాథన్ తన మధుర గానంతో రజతోత్సవాలకు ప్రత్యేక శోభ తీసుకురానున్నారు.
సంగీతం, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా జరగనున్న ఈ రజతోత్సవాల్లో ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు ప్రజలు, సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ రెండు రోజుల వేడుకలు సిలికాన్ ఆంధ్రా 25 ఏళ్ల సాంస్కృతిక ప్రస్థానానికి చిరస్మరణీయ ఘట్టంగా నిలుస్తాయని వారు వెల్లడించారు.