
యువ చెస్ సంచలనం, గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఘనంగా సత్కరించారు.నార్వే చెస్ టోర్నమెంట్లో చారిత్రక విజయం సాధించిన ప్రజ్ఞానందను అభినందించిన ఆయన రూ.50 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ప్రజ్ఞానందతో సీఎం విజయ్ కాసేపు సరదాగా చెస్ ఆడటం అందరిని ఆకట్టుకుంది.
ఓస్లోలో జరిగిన ప్రతిష్ఠాత్మక టోర్నీలో టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. టోర్నీలో భాగంగా ఆయన ప్రపంచ నంబర్ వన్, సొంతగడ్డ ఆటగాడైన మాగ్నస్ కార్ల్సెన్పై క్లాసికల్ ఫార్మాట్లో రెండుసార్లు గెలిచి, అరుదైన ఘనత సాధించారు. అలాగే, ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్పై కూడా విజయం సాధించి సత్తా చాటారు.ఈ సందర్భంలోనే అంతర్జాతీయ వేదికపై దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ప్రజ్ఞానంద మేధస్సును, సంయమనాన్ని సీఎం విజయ్ ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం తమిళనాడు క్రీడాభివృద్ధి ప్రాధికార సంస్థ తరఫున రూ. 50 లక్షల చెక్కుతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆధవ్ అర్జున, క్రీడాభివృద్ధి సంస్థ సభ్య కార్యదర్శి జె. మేఘనాథ రెడ్డి, ప్రజ్ఞానంద తల్లిదండ్రులు సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

