Find Articles

Spandana: అమెరికాలో స్పందనకు అండగా నిలిచిన ‘ఆటా’

Spandana: అమెరికాలో స్పందనకు అండగా నిలిచిన ‘ఆటా’

Spandana: అమెరికాలో తెలుగు వారికి అండగా నిలుస్తున్న అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌-ఆటా(ATA) మరోసారి మానవత్వం చాటుకుంది. మెట్రోస్టేషన్‌ మెట్లపై నుంచి ప్రమాదవశాత్తూ పడి అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్పందన అనే యువతి చికిత్సకు తన వంతు ప్రయత్నంగా అండగా నిలిచింది.

మంచిర్యాల నగరంలోని నస్పూర్ నాగార్జున కాలనీకి చెందిన శ్రీనివాస్, సునీత దంపతుల పెద్ద కుమార్తె లగిశెట్టి స్పందన చెన్నైలో బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లింది. ప్రస్తుతం ఆమె ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగో సమీపంలో గల ఎల్మ్‌హర్స్ట్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ రెండో సంవత్సరం చదువుతోంది. గత నెల 31న క్లాసులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లేందుకు మెట్రో మార్గంలో నడుస్తుండగా ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి సుమారు 25 అడుగుల ఎత్తు నుండి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో స్పందన తలకు బలమైన గాయం కావడంతో పాటు ఛాతీ, వెన్నెముక భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, రైల్వే సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇల్లినాయిస్‌లోని అడ్వకేట్ లూథరన్ జనరల్ హాస్పిటల్ ఐసీయూ విభాగంలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ప్రస్తుతానికి ఆమె పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని సమాచారం. కూతురు అమెరికాలో ప్రాణాపాయ స్థితిలో ఉందన్న వార్త తెలిసి స్పందన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే వారికి పాస్‌పోర్ట్, వీసా లేకపోవడంతో వెంటనే అమెరికా వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. స్పందన తండ్రి శ్రీనివాస్ మంచిర్యాలలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలను కష్టపడి చదివిస్తున్నారు. గతంలో జరిగిన ఒక ప్రమాదంలో ఆయనకు గాయాలు కావడంతో కుటుంబ భారాన్ని మోస్తూ కూతురిని విదేశాలకు పంపించారు. అంతలోనే ఈ ఘోరం జరగడంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోంది.

ఈ క్రమంలో నస్పూర్‌ కార్పొరేటర్‌ రాచకొండ గోపాల్‌రావు, నాయకులు రాచకొండ వెంకటేశ్వర్‌రావు, రిటైర్డ్‌ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ గందె వేణుమాధవ్‌రావు అమెరికాలోని ఆట సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. స్పందన తల్లిదండ్రుల పరిస్థితి గురించి వివరించారు. ఆయన అక్కడి తెలుగు అసోసియేషన్‌ నాయకులు, సభ్యులతో మాట్లాడి చికిత్సకు అయ్యే ఖర్చుల కోసం నిధులు సేకరించాలని నిర్ణయించినట్లు వివరించారు. గోఫండ్‌ రైజర్‌ అనే యాప్‌ ద్వారా ‘ఫండ్‌ మీ’ పేరిట స్పందన కోసం ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణ చేపట్టగా బుధవారం నాటికి రూ.2,55,28,046 జమయ్యాయి. స్పందన తల్లిదండ్రులు అమెరికా వెళ్లడానికి వీసా ఇప్పించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు కోరారు. మహిపాల్‌ ఆసుపత్రి వద్దకు వెళ్లి స్పందనను పరామర్శించి, వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

ManaTV Team