ప్రపంచంలో అత్యంత కీలకమైన భారత విదేశీ దౌత్య కార్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన దుబాయ్ భారత కాన్సులేట్కు తెలుగు ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి కాన్సుల్ జనరల్గా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, ఆయన పేరుపై కేంద్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
2008 బ్యాచ్కు చెందిన భారత విదేశాంగ సేవ (IFS) అధికారి అయిన డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా. న్యూఢిల్లీ ఎయిమ్స్లో వైద్య విద్య పూర్తి చేసిన ఆయన, అనంతరం భారత విదేశాంగ సేవలో చేరి వివిధ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ఇటీవల వరకు తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటేషన్పై పెట్టుబడులు, పరిశ్రమల శాఖల వ్యవహారాలను పర్యవేక్షించిన ఆయన, అంతకుముందు ఐక్యరాజ్య సమితి, అమెరికా, ఐరోపా దేశాల్లో దౌత్యపరమైన బాధ్యతలు నిర్వహించారు. అలాగే హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిగా కూడా సేవలందించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దాదాపు 40 లక్షల మంది భారతీయులు నివసిస్తూ, ఉద్యోగాలు చేస్తున్నారు. అందువల్ల దుబాయ్ భారత కాన్సులేట్కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భారత్కు కీలక వాణిజ్య భాగస్వామిగా ఉన్న యూఏఈలో ఈ పదవి అత్యంత కీలకమైనదిగా భావిస్తారు.
డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి నియామకం అధికారికంగా ఖరారైతే, గల్ఫ్ దేశాల్లో అత్యున్నత భారత దౌత్య హోదాల్లో పనిచేస్తున్న తెలుగు అధికారుల సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని జెద్దాలో ఫహాద్ ఖాన్ సూరి, ఖతర్లో కొప్పుల శ్రీకర్ రెడ్డి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దుబాయ్ భారత కాన్సుల్ జనరల్గా తొలి తెలుగు అధికారి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ నియామకం తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారిక ప్రకటన కోసం దౌత్య వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.