Find Articles

CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. రాష్ట్రాభివృద్ధిపై చర్చ

CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. రాష్ట్రాభివృద్ధిపై చర్చ

CM Revanth Meets PM Modi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంతో నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాలు పెంపు, ఉపాధి కల్పన, ఆరోగ్యం వంటి అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.

అనంతరం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయి రాష్ట్రాభివృద్ధి గురించి చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సహకారంపై సుదీర్ఘంగా చర్చించారు. మెట్రో రెండో విడత విస్తరణ, పాలమూరు ప్రాజెక్టుకు క్లియరెన్స్ పై చర్చించినట్లు సమాచారం

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ద్వారా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు. కోట్లాది మంది ప్రజల వివరాలను సేకరించిన ఈ సర్వేలో సామాజిక వెనుకబాటుతనానికి భూమి, ఆస్తుల కంటే విద్యే ప్రధాన కారణమని తేలిందన్నారు. అందుకే విద్యను అందరికీ చేరువ చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు.

CM Revanth Reddy

విద్యాశాఖను తన వద్దే ఉంచుకోవడానికి కారణం కూడా విద్యపై ఉన్న విశ్వాసమేనని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు విస్తృత స్థాయిలో మార్పులు చేపడుతున్నామని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం బోధన, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, పాఠశాల బస్సులు, క్రీడా సదుపాయాలు వంటి సౌకర్యాలను కల్పిస్తున్నామని వివరించారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ పాఠశాలల్లో అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకోవడం ద్వారా సామాజిక సమానత్వం పెరుగుతుందని, కుల వివక్ష తగ్గే అవకాశముందని పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు ఈ విద్యా నమూనాను పరిశీలించాలనుకుంటే స్వాగతిస్తామని కూడా తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నైపుణ్యాభివృద్ధిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రేవంత్ వెల్లడించారు.

‘తెలంగాణ రైజింగ్’ విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మరింత బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు తెలంగాణను కేంద్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

అంతకుముందు నీతి ఆయోగ్ వేదికగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, దేశ అభివృద్ధికి విద్య మరియు వైద్యం రెండు ప్రధాన స్తంభాలని స్పష్టం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రజల పురోగతే దేశ పురోగతికి పునాది అని, విద్యావంతులైన, ఆరోగ్యవంతులైన పౌరులే ఆర్థికాభివృద్ధికి ప్రధాన శక్తిగా మారతారని అభిప్రాయపడ్డారు.

ManaTV Team