
ఏపీలోని గుంటూరుకు చెందిన యువ క్రికెట్ సంచలనం షేక్ రషీద్ జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ చాటారు.. ప్రతిష్టాత్మక భారత్-ఎ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 24 నుంచి శ్రీలంక వేదికగా ప్రారంభం కానున్న ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్లో భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక ప్రకటన చేసింది.
షేక్ రషీద్ గతంలో భారత అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో వైస్ కెప్టెన్గా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో ఒత్తిడిలోనూ నిలకడగా ఆడి భారత జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఐపీఎల్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ వంటి స్టార్ ఫ్రాంచైజీకి ఎంపికై మహేంద్ర సింగ్ ధోనీ పర్యవేక్షణలో నైపుణ్యం సాధించారు. మొత్తంగా రషీద్ కనబరిచిన అద్భుతమైన ప్రదర్శన, స్థిరమైన బ్యాటింగ్ జట్టుకు ఎంపికయ్యేలా చేశాయి. రషీద్ ఎంపికతో గుంటూరులో పండుగ వాతావరణం నెలకొంది.

