
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘పెద్ది’. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఆ సినిమాకు సంబంధించిన వివాదం టాలీవుడ్లో కొత్త చర్చకు దారి తీసింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానంపై వచ్చిన విమర్శలకు దర్శకుడు బుచ్చిబాబు సానా క్షమాపణ చెప్పి, కొన్ని సన్నివేశాలను తొలగించడాన్ని ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ బహిరంగంగా తప్పుబట్టారు.
‘పెద్ది’ చిత్ర సక్సెస్ మీట్లో పాల్గొన్న అనంత శ్రీరామ్ మాట్లాడుతూ, దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ చెప్పి ఉండకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక పాత్రను దర్శకులు ఎవరైనా తమ ఊహకు తగ్గట్లు సృష్టిస్తారు. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని కామెంట్లకు భయపడి సృజనాత్మకతను పరిమితం చేయకూడదని, అందుకే దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథలో పాత్రల ప్రవర్తన సహజంగానే కాస్త పచ్చిగా ఉంటుందని, దానిని తప్పుగా అర్థం చేసుకోకూడదని తెలిపారు.
అసలు వివాదం ఏంటంటే.?
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రంలో జాన్వీ కపూర్ పాత్రను కొన్ని సన్నివేశాలు అతిగా, మహిళలను వస్తువుగా చిత్రీకరించేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ట్రోలింగ్పై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు, ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అంతేకాకుండా, ఆడియెన్స్ అభ్యంతరం వ్యక్తం చేసిన కొన్ని షాట్లను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

