
టీమిండియాకు గాయం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీకి చెందిన ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరగనున్న టీ20 సిరీస్లకు దూరమయ్యారు. దీంతో ఆయన స్థానంలో ముంబై యువ ఆల్రౌండర్ సూర్యాంశ్ షెడ్గేకు మొదటిసారి సీనియర్ టీమ్ లో చోటు కల్పించినట్లు బీసీసీఐ తెలిపింది.
ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మూడో వన్డే అనంతరం నితీశ్ ఎడమ తొడ కండరాల సమస్యతో బాధపడ్డారు.అతడికి కొంతకాలం విశ్రాంతి, పునరావాసం అవసరమని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించింది. దీంతో ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరిగే రెండు టీ20 సిరీస్ల నుంచి అతడిని తప్పించారు.ఇప్పటికే గాయం కారణంగా హార్దిక్ పాండ్య అందుబాటులో లేకపోవడంతో, నితీశ్ రెడ్డి జట్టులో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారని అంతా భావించారు.ముఖ్యంగా బ్యాటింగ్తో పాటు మీడియం పేస్ బౌలింగ్ చేయగల ఆల్రౌండర్గా అతడు టీమ్ కు బ్యాలెన్స్ తీసుకొచ్చే ప్లేయర్ గా గుర్తింపు పొందారు. కానీ గాయం కారణంగా అతను కూడా టూర్కు దూరం కావడం నిరాశ కలిగించింది.
ఇక సూర్యాంశ్ షెడ్గే ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై-సిరీస్లో ఇండియా-ఏ తరఫున ఆకట్టుకున్నారు. ఐదు మ్యాచ్ల్లో 147 పరుగులు చేయడంతో పాటు బంతితో కూడా రెండు వికెట్లు సాధించారు.అంతేకాదు 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ టోర్నీలో 251.92 స్ట్రైక్రేట్తో 131 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.కుడిచేతి బ్యాటర్, మీడియం పేస్ బౌలర్ అయిన షెడ్గే క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా పరుగులు చేయగల ప్లేయర్ గా గుర్తింపు పొందారు.ఈ నేపథ్యంలోనే నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ షెడ్గే ఎంపికయ్యారు.

