
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్తో జరిగిన మ్యాచ్లో 78వ నిమిషం వరకు 0-2తో వెనుకబడిన అర్జెంటీనా, ఆఖరి నిమిషాల్లో మాయ చేసింది. 3-2 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ ఎంతటి ఒత్తిడిని తెచ్చిందంటే, ఫైనల్ విజిల్ మోగిన తర్వాత కెప్టెన్ లియోనెల్ మెస్సీ కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయి.
అట్లాంటాలో జరిగిన ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి ఈజిప్ట్ ఆధిపత్యం ప్రదర్శించింది. యాసర్ ఇబ్రహీం, ముస్తఫా జికో గోల్స్తో ఈజిప్ట్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు, అర్జెంటీనాకు దక్కిన పెనాల్టీని మెస్సీ గోల్గా మలచడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో అర్జెంటీనా ఓటమి ఖాయమని అందరూ భావించారు. మ్యాచ్ చూస్తున్న అభిమానులు సైతం నిరాశలో మునిగిపోయారు.
కానీ, అసలైన గేమ్ ఆఖరి 11 నిమిషాల్లోనే మొదలైంది. 79వ నిమిషంలో క్రిస్టియన్ రొమెరో హెడర్తో ఒక గోల్ చేయడంతో అర్జెంటీనాలో ఆశలు చిగురించాయి. ఆ తర్వాత సరిగ్గా నాలుగు నిమిషాలకు, 83వ నిమిషంలో లియోనెల్ మెస్సీ అద్భుతమైన గోల్తో స్కోరును 2-2తో సమం చేశారు. ఈ గోల్తో ఈ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ (8) చేసిన ప్లేయర్ గా గోల్డెన్ బూట్ రేసులో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు.
ఇక డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్లో స్టాపేజ్ టైమ్ (92వ నిమిషం)లో ఎంజో ఫెర్నాండెజ్ హెడర్తో మరో గోల్ చేసి అర్జెంటీనాకు 3-2 తేడాతో విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో ఈజిప్ట్ ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలోనే సంచలన ఆరోపణలు చేశారు. మ్యాచ్లో తమకు వ్యతిరేకంగా కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని, ఒక గోల్ను వీఏఆర్ ద్వారా అన్యాయంగా రద్దు చేశారని ఆరోపించారు. అర్జెంటీనా విన్నింగ్ గోల్ తర్వాత ఈజిప్ట్ కోచింగ్ సిబ్బందిలో ఒకరికి రెడ్ కార్డ్ కూడా చూపించారు. ఈ విజయంతో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది.
