
ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ‘రామాయణం’ ఫ్యాన్ మేడ్ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో శ్రీరాముడిగా మహేశ్ బాబును, రావణుడిగా జూనియర్ ఎన్టీఆర్ను చూపిస్తుంది. దీనికి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ్’ చిత్ర అధికారిక ట్రైలర్ విడుదల కావడానికి కొద్ది రోజుల ముందే ఈ ఏఐ వీడియో వెలుగులోకి రావడం విశేషం.
ఓ యూట్యూబ్ ఛానెల్ రూపొందించిన ఈ ట్రైలర్లో మహేశ్ బాబు (రాముడు), కీర్తి సురేశ్ (సీత), జూనియర్ ఎన్టీఆర్ (రావణుడు), జాన్వీ కపూర్ (మండోదరి)లను ఏఐ సాయంతో సృజనాత్మకంగా ఆవిష్కరించారు. మరీ ముఖ్యంగా సీతాపహరణం సమయంలో రాముడి వేదనను, పరమ శివభక్తుడిగా రావణుడిని చూపించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
నిజానికి, నితేశ్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ్’ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంతోనే సాయి పల్లవి బాలీవుడ్ అరంగేట్రం చేస్తుండటం గమనార్హం. అలాగే హనుమంతుడిగా సన్నీ డియోల్, మండోదరిగా కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు ఈ భారీ ప్రాజెక్టును సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

