
భారత మహిళా వికెట్ కీపర్-బ్యాటర్ యస్తికా భాటియా చరిత్ర సృష్టించారు.. ప్రముఖ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో మూడో రోజు యస్తికా ఈ అరుదైన ఘనత సాధించారు.
ఇంగ్లండ్ తో ఏకైక టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి, 91 పరుగులతో క్రీజులో ఉన్నారు యస్తికా. విరామం తరువాత తిరిగి ఆట మొదలయ్యాక ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. ఇంగ్లండ్ పేసర్ ఇస్సీ వాంగ్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి, ఆపై కవర్స్ దిశగా సింగిల్ తీసి తన తొలి అంతర్జాతీయ సెంచరీ కంప్లీట్ చేశారు. 145 బంతుల్లో 12 ఫోర్ల సహాయంతో ఆమె ఈ సెంచరీని నమోదు చేసింది. తరువాత భావోద్వేగానికి లోనైన యస్తికా గ్రౌండ్ లోనే మోకాళ్లపై కూర్చొని పిచ్ను ముద్దాడారు..దీంతో స్టేడియంలోని ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లతో ఆమెను అభినందించారు.
కెరీర్ను ప్రమాదంలో పడేసిన మోకాలి గాయం నుంచి కోలుకుకున్న యస్తికా.. ఈ ఇంగ్లండ్ పర్యటనతోనే అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి అడుగుపెట్టారు. ఇప్పుడు ఈ చారిత్రక ఇన్నింగ్స్తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నారు.. ఆట ప్రారంభమైన తొలి బంతికే లారెన్ బెల్ వేసిన బంతి వికెట్లను తాకినా బెయిల్స్ కింద పడకపోవడంతో యస్తికా గేమ్ లో నిలబడ్డారు. ఈ నేపథ్యంలోనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. దీంతో ఇదే మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇప్పటికే లార్డ్స్ ఆనర్స్ బోర్డుపై చోటు సంపాదించిన తన సహచర క్రీడాకారిణి క్రాంతి గౌడ్ సరసన యస్తికా కూడా చేరారు.

