
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ‘లెనిన్’ యూనిట్ను అభినందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
‘లెనిన్’ చిత్రానికి అన్ని వైపుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన చూడటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చిరంజీవి తన పోస్ట్లో పేర్కొన్నారు. ఒక సినిమా కేవలం బాక్సాఫీస్ విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల నుంచి ఇలాంటి గొప్ప ప్రశంసలు అందుకోవడం సంతోషాన్నిచ్చే విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భారీ విజయం సాధించిన సందర్భంగా చిత్రయూనిట్ మొత్తానికి మెగాస్టార్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ముఖ్యంగా హీరో అఖిల్ అక్కినేని నటనపై చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. “అఖిల్ నాకు మరో కొడుకులాంటి వాడు. ప్రతి సినిమాతో నటుడిగా మరింత పరిణతి సాధిస్తూ, ఎదుగుతున్న అతడిని ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది” అంటూ మెగాస్టార్ రాసుకొచ్చారు. ఈ చిత్రం సాధించిన ఘన విజయం అఖిల్ కెరీర్లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఒక బలమైన నాంది కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా తన చిరకాల మిత్రుడు, కింగ్ అక్కినేని నాగార్జునకు కూడా చిరంజీవి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అక్కినేని కుటుంబానికి ఇంతటి ఆనందాన్ని అందించిన ఈ విజయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశంసలకు అర్హులని కొనియాడారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు, కథానాయిక భాగ్యశ్రీ బోర్సే, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులకు ఆయన అభినందనలు అందజేశారు. అయితే, తాను ఇంకా ‘లెనిన్’ చిత్రాన్ని చూడలేదని, కానీ ప్రేక్షకుల నుంచి వస్తున్న హర్షాతిరేకాలు చూశాక సినిమా చూడాలనే ఆసక్తి తనలో మరింత పెరిగిందని చిరంజీవి వెల్లడించారు. చిరంజీవి చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్తో అటు మెగా అభిమానులు, ఇటు అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

