
అమెరికాలో జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్–2026లో ఆధ్యాత్మిక వైభవానికి నాంది పలుకుతూ తొలిసారిగా శ్రీ శివపార్వతుల దివ్య కల్యాణ మహోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ATA స్పిరిచువల్ కమిటీ ప్రకటించింది.
ఈ పవిత్ర వేడుకకు ATA సభ్యులు, తెలుగు కుటుంబాలు, భక్తులు, భారతీయ సమాజ సభ్యులందరికీ స్పిరిచువల్ కమిటీ ఘన ఆహ్వానం పలికింది. ఈ దివ్య కల్యాణాన్ని భారతదేశంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్థానం ఆశీస్సులు, మార్గదర్శకత్వంలో నిర్వహించనున్నారు. అంతేకాకుండా, ఈ వేడుక కోసం ప్రత్యేకంగా ఉత్సవ మూర్తులను భారతదేశం నుంచి అమెరికాకు తీసుకురానున్నారు.
ATA చరిత్రలోనే తొలిసారిగా ఇంత వైభవంగా నిర్వహించనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం తెలుగు సంప్రదాయాలను, సనాతన ధర్మ వైభవాన్ని అమెరికా గడ్డపై ప్రతిష్ఠాత్మకంగా చాటిచెప్పనుంది.
ఈ సందర్భంగా భక్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని పరమేశ్వరుడు, పార్వతీదేవి దివ్య ఆశీర్వాదాలను పొందాలని, ఈ చారిత్రాత్మక వేడుకను విజయవంతం చేయాలని ATA స్పిరిచువల్ కమిటీ పిలుపునిచ్చింది.

