న్యూఢిల్లీ: భారత్లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్లకు ప్రత్యామ్నాయంగా పాలిమర్ నోట్లను వచ్చే ఏడాదిలో ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
పాలిమర్ నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక షీట్ల కోసం ఆర్బీఐ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్, చైనాతో సంబంధం ఉన్న కంపెనీలను టెండర్ ప్రక్రియ నుంచి నిషేధించినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 18న టెండర్ల ప్రక్రియ ముగియగా.. యూకే, ఆస్ట్రేలియా, వియత్నాంకు చెందిన కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. ఆయా కంపెనీలు సమర్పించిన నమూనాలను పరీక్షించిన అనంతరం తుది ఎంపిక చేపట్టనున్నట్లు సమాచారం.
తొలిదశలో రూ.10, రూ.20 విలువ కలిగిన నోట్లను పాలిమర్తో తయారు చేసి చలామణిలోకి తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటంతో పాటు, నకిలీ నోట్లను అరికట్టేందుకు మెరుగైన భద్రతా లక్షణాలను కలిగి ఉండే అవకాశం ఉంది.
పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రవేశంతో భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది.