
న్యూయార్క్ : ఉత్తర అమెరికాలో భారతీయ మూలాల మీడియా నిపుణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపెద్ద సంస్థ ఇండో-అమెరికన్ ప్రెస్ క్లబ్ (IAPC) ఆధ్వర్యంలో న్యూయార్క్లోని కేరళ సెంటర్లో జరిగిన ఘన కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు, రచయిత, విద్యావేత్త, సామాజిక సేవకుడు డాక్టర్ సతీష్ కథులా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 100 మందికి పైగా మీడియా, వ్యాపార, సామాజిక రంగ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారత కాన్సులేట్ ప్రెస్ అండ్ ఇన్ఫర్మేషన్ కాన్సుల్ పీయూష్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేశారు. భారతీయ అమెరికన్లు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. IAPC వ్యవస్థాపక చైర్మన్ గిన్స్మోన్ జకరయ్య, మాజీ చైర్మన్ కమలేష్ మెహతా నూతన చైర్మన్తో పాటు బోర్డ్ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, స్థానిక చాప్టర్ నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మీడియాకు అందించిన విశేష సేవలకు బాబ్ వర్గీస్కు గౌరవ సభ్యత్వాన్ని ప్రదానం చేశారు.
“పత్రికలే నాకు ప్రపంచాన్ని పరిచయం చేశాయి”
చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ సతీష్ కథులా భావోద్వేగ ప్రసంగం చేశారు. చిన్న పట్టణంలో టెలివిజన్ లేని రోజుల్లో పత్రికలు, రేడియో తనకు ప్రపంచాన్ని పరిచయం చేశాయని గుర్తు చేసుకున్నారు. నేటి జర్నలిజం తప్పుడు సమాచార ప్రచారం, రాజకీయ విభజనలు వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, నిజాన్ని కాపాడే బాధ్యత మీడియాపైనే ఉందన్నారు.
