Find Articles

USNEWS: అమెరికాలో అరుదైన పుణ్యక్షేత్రం…శ్రీ విద్యా టెంపుల్‌లో వైభవంగా అమ్మవారి పూజలు

USNEWS: అమెరికాలో అరుదైన పుణ్యక్షేత్రం…శ్రీ విద్యా టెంపుల్‌లో వైభవంగా అమ్మవారి పూజలు

న్యూయార్క్ రాష్ట్రంలో Rochester సమీపంలోని రష్ నగరంలో వెలసిన అరుదైన పుణ్యక్షేత్రం — శ్రీ విద్యా టెంపుల్ సొసైటీ. శక్తి ప్రధాన శివాలయంగా పేరుగాంచిన ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మహిమాన్వితంగా కొలువై భక్తులపై కరుణాకటాక్షాలు కురిపిస్తున్నారు.

ఈ ఆలయ వ్యవస్థాపకులు మరియు పీఠాధిపతులు శ్రీ చైతన్యానంద సరస్వతి నవరత్నం విజయహరణ్ గారు. శ్రీ విద్యా పరంపర వైభవాన్ని, ఈ ఆలయ మహత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలనే సంకల్పంతో ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రపంచంలోని అనేక హిందూ దేవాలయాల్లో కనిపించని ఒక విశిష్టమైన ఆచారం ఈ ఆలయంలో కొనసాగుతోంది.స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతి భక్తుడు స్వయంగా పూజలు నిర్వహించే అవకాశం ఇక్కడ కలదు. భక్తులు తమ స్వహస్తాలతో అభిషేకం చేయడమే కాకుండా, దేవతా విగ్రహాలను భక్తిశ్రద్ధలతో స్పృశించవచ్చు. దైవానుభూతిని మరింత సన్నిహితంగా అనుభవింపజేసే ఈ సంప్రదాయం ఆలయ ప్రత్యేకతగా నిలుస్తోంది.

మే 23 మరియు 24 తేదీలలో అమ్మవారి కలశపూజ, హోమం, మహాభిషేకాలు, అలాగే గ్రహ దోష నివారణార్థం రాశి మండల పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. శంఖనాదాలు, సన్నాయి మేళాలు, దీపాల వెలుగులు, వేదమంత్రాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక తేజస్సుతో కళకళలాడింది. ఆ పవిత్ర వాతావరణం ప్రతి భక్తుని మనసులో భక్తి భావాన్ని నింపింది.

ప్రతి శనివారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి కలశపూజ, హోమం, అభిషేకం, అలంకార మహోత్సవాలు విశేషంగా నిర్వహించడం ఈ ఆలయ ఆనవాయితీ. ఈ సందర్భంగా మే 23 శనివారం కామధేనువు పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా కలశపూజ నిర్వహించి, అనంతరం హోమం, తదుపరి అమ్మవారికి మహాభిషేకం చేశారు.

వేదమంత్రాలు, నాదస్వరాల నడుమ శ్రీవిద్య ఉపాసకులు ఊరేగింపుగా వచ్చి పవిత్ర కలశాలతో అభిషేకం నిర్వహించగా, మహిళలు శంఖాభిషేకంతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. అనంతరం అమ్మవారిని దివ్యంగా అలంకరించి, లక్ష్మీ సహస్రనామ పారాయణంతో ఆలయం అంతా భక్తిరసమయంగా మారింది. భక్తులు మంత్రోచ్చారణల మధ్య మహామంగళహారతి సమర్పించి, ఉత్తర దిశ వైపు తిరిగి నమస్కరించి, ప్రసాద స్వీకారంతో కార్యక్రమాన్ని మంగళప్రదంగా ముగించారు.

మే 24 ఆదివారం నిర్వహించిన గ్రహ దోష నివారణ రాశి మండల పూజలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శాంతి, శుభఫలితాలు, ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ పవిత్ర పూజ ద్వారా గ్రహ దోషాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని విశ్వసిస్తున్నారు. ఈ మహోత్సవాలకు కెనడా సహా వివిధ దేశాలు, రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విద్యా టెంపుల్ సొసైటీ పీఠాధిపతులు శ్రీ చైతన్యానంద సరస్వతి నవరత్నం విజయహరణ్ గారు, శ్రీవిద్య ఉపాసకులు శ్రీ శంకర దేవరకొండ గారు, ఆలయ అధ్యక్షులు శ్రీ గణేష్ మాధ్వనాథ్ గారు, Treasurer వీణా నాయక్ అరిబిండి గారు, బోర్డ్ సభ్యురాలు మరియు రాజగోపురం ప్రాజెక్ట్ చైర్ ప్రియంగా సేయోన్ గారు, వాలంటీర్లు మరియు భక్తులు ఆలయ విశిష్టతను భక్తులతో పంచుకున్నారు.

ManaTV Team