
ఉన్నత చదువులు చదవడానికి విదేశాలకు వెళ్లిన కూతురు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంది. కానీ ఆమెను చూసే అవకాశం లేదు. దాంతో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ నాగార్జున కాలనీలో నివసించే లగిశెట్టి శ్రీనివాస్, సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు స్పందన. చెన్నైలో బీటెక్ పూర్తి చేసి, ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లింది. చికాగో నగరానికి సమీపంలో ఉన్న ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఎల్మ్ ర్ హర్ట్స్ యూనివర్సిటీలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే కాలేజీకి వెళ్లిన స్పందన మెట్రో ట్రైన్ లో తన నివాసానికి చేరుకునే క్రమంలో ప్రమాదానికి గురైంది. మెట్రోస్టేషన్ మెట్లపై భాగం నుండి కిందపడి తీవ్రంగా గాయపడిందని తెలుస్తోంది. ప్రస్తుతం పార్క్ రిడ్జ్ లోని అడ్వొకేట్ లూథరన్ జనరల్ ఆస్పత్రిలో స్పందన చికిత్స పొందుతోంది.
స్పందన స్నేహితులు చెబుతున్న వివరాల ప్రకారం.. గత నెల 31న స్పందన సుమారు 25 అడుగుల ఎత్తు నుంచి కింద పడింది. దీంతో ఆమె తలతో పాటు పక్కటెముకలు, వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయి. తల్లిదండ్రుల కలను సాకారం చేయడమే లక్ష్యంగా, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన స్పందన ఇలా ప్రమాదానికి గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమకు పాస్ పోర్ట్, వీసా లేవని, అక్కడకు వెళ్లే ఆర్థిక స్థోమత కూడా లేదని వాపోతున్నారు. కనీసం కన్న బిడ్డను చూసుకునే అవకాశం కూడా అల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వపరంగా సహాయం అందించాలని కోరుతూ శ్రీనివాస్ దంపతులు కలెక్టర్ కుమార్ దీపక్ ను కలిశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనకు అండగా ఉంటానని ఓదార్చారని తెలిపారు. పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నానని, వీసా కోసం ఎంత సమయం పడుతుందో తెలియదని చెప్పారు. తన పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని కోరారు.

