
తమిళనాడు సీఎం విజయ్ పై టెలివిజన్ నటి, బిగ్ బాస్ ఫేమ్ జూలీ సంచలన ఆరోపణలు చేశారు. తన కడుపులోని బిడ్డను కోల్పోవడానికి పరోక్షంగా ఆయనే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని రేపుతున్నాయి.
తమిళనాడులో జల్లికట్టు ఉద్యమంతో వెలుగులోకి వచ్చి, బిగ్ బాస్ షోతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువైన నటి జూలి అలియాస్ మేరీ జూలియానా. ఇటీవల ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో తనపై చేసిన ట్రోలింగ్, వేధింపుల వల్లే తాను తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానని తెలిపారు.అదే తన కడుపులోని బిడ్డను కోల్పోవడానికి కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నా బిడ్డను కోల్పోవడానికి విజయ్ అన్నే బాధ్యుడు. ఆయన నేరుగా ఈ పని చేయకపోయినప్పటికీ, తన అభిమానులకు ఆపమని ఒక్క మాట చెప్పి ఉంటే తాను బిడ్డను కోల్పోయేదాన్ని కాదని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో విజయ్ రాజకీయ విధానాలపై విమర్శలు చేయడంతో పాటు మెరీనా బీచ్ వద్ద నిరసన తెలపడం వలనే తనను టార్గెట్ గా చేసుకున్నారని జూలీ తెలిపారు. సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ చేస్తూ వేధింపులకు గురి చేశారని పేర్కొన్నారు. చివరకు తనపై రూ.15 లక్షల విలువైన నకిలీ కిడ్నీ స్కామ్ ఆరోపణలు కూడా చేశారని వాపోయారు.జూలీ చేసిన ఈ ఆరోపణలను సీఎం విజయ్ మద్దతుదారులు, టీవీకే నేతలు, కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.

