
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘ పెద్ది’. తాజాగా విజయవాడలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ అభిమానులపై పొగడ్తల వర్షం కురిపించారు.విజయవాడలో జరిగిన ఈ వేడుక ప్రీ రిలీజ్ ఫంక్షన్ లా కాకుండా, సక్సెస్ మీట్ లా ఉందని వ్యాఖ్యానించారు. అభిమానుల ఉత్సాహం, ప్రేమ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. విజయవాడ తమకు అదృష్ట నగరమని పేర్కొన్నారు. తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి సినిమాల బ్లాక్బస్టర్ల వేడుకలు ఇక్కడే జరిగాయని, ఆ సెంటిమెంట్ను, లక్ను తమతో తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.అంతేకాదు ప్రేక్షకులు, అభిమానుల కోసమే ఈ సినిమాలని చెప్పారు. చేతులు విరగ్గొట్టుకోవడమే కాదు, అవసరమైతే రక్తం చిందించైనా మిమ్మల్ని అలరిస్తాను. చిరంజీవి కొడుకుగా, కల్యాణ్ బాబాయ్కి అబ్బాయిగా పుట్టిన తనకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదన్నారు. తాను చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని, అది రాసి పెట్టుకోండి అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.
‘పెద్ది’ మూవీ గురించి మాట్లాడుతూ, “ఒక నటుడిగా ఎన్నో కథలు వింటాం. కొన్ని నచ్చుతాయి, కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ‘పెద్ది’ కథ విన్నప్పుడు గుండెకు హత్తుకుపోయిందని తెలిపారు.ఇది పదేళ్లకొకసారి వచ్చే అద్భుతమైన కథ.తన సినిమా లైబ్రరీలో ఇది చిరకాలం నిలిచిపోయే చిత్రం అవుతుందని పేర్కొన్నారు. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్లీ ప్రతిరోజూ ఎప్పుడెప్పుడు షూటింగ్కు వెళ్లాలా అనిపించిన సినిమా ‘పెద్ది'” అని రామ్ చరణ్ తెలిపారు. చివరగా సినిమాలోని డైలాగ్ను గుర్తుచేస్తూ, “పెద్దిగాడు ఆట ఆడలేదు, పోరాడాడు. ఈ పెద్దిగాడి ఆత్మగౌరవాన్ని దుర్గమ్మ తల్లి సాక్షిగా మీరందరూ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.
